Mohan Babu: అతిపెద్ద సాయిబాబా ఆలయం నిర్మించాం... దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్దది: మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తిరుపతి సమీపంలోని చంద్రగిరి వద్ద విద్యానికేతన్ పేరిట విద్యాసంస్థలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విద్యానికేతన్ ఆలయంలో మోహన్ బాబు భారీస్థాయిలో సాయిబాబా ఆలయం నిర్మించారు. సాయిబాబా మోహన్ బాబుకు ఇష్టదైవం. దాంతో ఆయన ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ లో వెల్లడించారు. తాము నిర్మించిన సాయిబాబా ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదని వెల్లడించారు. ఇంతటి భారీ ఆలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా మొదటిరోజున యాగాన్ని నిర్వహించినట్టు మోహన్ బాబు వివరించారు. 

ఇదొక అద్భుతం అని, తన దృష్టిలో ఇక షిరిడీ ఆలయానికి వెళ్లనక్కర్లేదని అభిప్రాయపడ్డారు. తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చేవాళ్లు ఈ ఆలయానికి కూడా వచ్చే విధంగా ఆలయం నిర్మించాలని, లేకపోతే నిర్మించవద్దని తన కుమారుడు విష్ణు అన్నాడని మోహన్ బాబు వెల్లడించారు. ఆ విధంగానే గొప్పగా సాయిబాబా ఆలయాన్ని నిర్మించామని తెలిపారు.
Mohan Babu
Saibaba Temple
Biggest
South India
Vidyaniketan
Chandragiri

More Telugu News