గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తాం: సోము వీర్రాజు
- టీడీపీ, వైసీపీ నేతలపై సోము వీర్రాజు ఫైర్
- అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- మళ్లీ ప్రత్యేక హోదా అని ఎలా మాట్లాడతారని ప్రశ్న
చంద్రబాబే మోసం చేశారు కానీ బీజేపీ ఎప్పుడూ మాట తప్పలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నా, మోదీ ఏపీ అభివృద్ధికి నిధులు ఇచ్చారని వెల్లడించారు. అయినా రాజధాని అభివృద్ధి చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఉపయోగించింది నిజం కాదా? అని నిలదీశారు. మళ్లీ ప్రత్యేక హోదా అని ఎలా మాట్లాడతారని మండిపడ్డారు.
మరొక ఆయన మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ విమర్శించారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం ఏమిటి? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని అభివృద్ధికి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, దండుకోవడమే ఈ రెండు పార్టీల పని అని వెల్లడించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తామని అంటున్నారని, వారు ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.