CM Ramesh: నాపై అసత్యప్రచారం మాని తమ కుటుంబ వ్యవహారాలు, పార్టీలో లుకలుకలు చూసుకుంటే మంచిది: సీఎం రమేశ్

CM Ramesh responds via social media
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో 'ఆఫ్ ద రికార్డ్' గా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే మాదిరిగా ఏపీ టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 50-60 సీట్లు వస్తే వాటిని సీఎం రమేశ్ బీజేపీలోకి తీసుకెళతాడని కేశినేని అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 

దీనిపై సీఎం రమేశ్ ట్విట్టర్ లో స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. "నాపై అసందర్భంగా, సత్యదూరమైన ఆరోపణలు, కల్పితాలు ప్రచారం చేయడం మాని కుటుంబ వ్యవహారాలు, వాళ్ల పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టిపెడితే బాగుంటుంది" అంటూ సీఎం రమేశ్ హితవు పలికారు. 

ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు కానీ, ఆధారాలు కానీ అవసరం లేదు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను సీఎం రమేశ్ ఎవరిని ఉద్దేశించి చేసిందీ వారి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
Go Back to Shorts
CM Ramesh
Kesineni Nani
TDP
BJP
Andhra Pradesh

More Telugu News