ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా పంజా.. 68.81 శాతం కొత్త కేసులు అక్కడి నుంచే
- 24 గంటల్లో 18 వేల 840 కొత్త కేసుల నమోదు
- నిన్నటి కంటే 2693 కేసుల పెరుగుదల
- 43 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. కేరళలో ఒక్కరోజే 3310 కొత్త కేసులు నమోదవగా.. పశ్చిమ బెంగాల్లో 2950, మహారాష్ట్రలో 2944, తమిళనాడులో 2722, కర్ణాటకలో 1037 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 68.81 శాతం కొత్త కేసులు రాగా.. ఒక్క కేరళలోనే 17.57 శాతం కేసులు రావడం గమనార్హం.
ఇక, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,53,980కి చేరుకుంది. రికవరీ రేటు 98.51గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 1,25,028 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో 12,26,795 కొవిడ్ వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటిదాకా 198,65,36,288 వ్యాక్సిన్లు అందజేశారు.