YSRCP: గ‌న్న‌వ‌రం వైసీపీ ప్లీన‌రీకి ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ గైర్హాజ‌రు

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీన‌రీకి స‌న్నాహ‌కంగా జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జిల్లా, అసెంబ్లీ నియోజకవ‌ర్గ ప్లీన‌రీల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం గ‌న్న‌వ‌రంలో జ‌రిగిన కృష్ణా జిల్లా ప్లీన‌రీకి స్థానిక ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ గైర్హాజ‌ర‌య్యారు. జిల్లాకు చెందిన మంత్రి జోగి ర‌మేశ్ నేతృత్వంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు హాజ‌ర‌య్యారు. అయితే వంశీ మాత్రం హాజ‌రుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై గ‌న్న‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ... ఆ త‌ర్వాత వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. అయితే వైసీపీలో చేరుతున్నట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించ‌లేదు. వైసీపీ కూడా ఈ దిశ‌గా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ కార‌ణంగానే ఆయ‌న వైసీపీ ప్లీన‌రీకి హాజ‌రు కాలేదా? అన్న వాదనలు కూడా వున్నాయి. అయితే అనారోగ్య కార‌ణాల‌తోనే వంశీ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌లే మొహాలీలో వంశీ అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే.
YSRCP
Jogi Ramesh
Kodali Nani
Perni Nani
Vallabhaneni Vamsi
Gannavaram
Krishna District

More Telugu News