Vijayashanti: సికింద్రాబాద్ హింస వెనుక కుట్ర ఉందనడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి: విజయశాంతి

Vijayasanthi alleges conspiracy behind Secunderabad violence
  • అగ్నిపథ్ నియామక విధానంపై నిరసనలు
  • నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింస
  • ఒకరి మృతి, పలువురికి గాయాలు
  • ఇది కుట్రే అంటున్న విజయశాంతి
  • నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని వెల్లడి
సికింద్రాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు బీజేపీ వ్యతిరేక శక్తుల పనే అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమం పేరిట సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన హింస వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఆరోపించారు. అందుకు ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. 

ఈ ఆందోళన కోసం పెద్ద సంఖ్యలో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి, ముందస్తు ప్రణాళికతో విధ్వంసం దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. 

అగ్నిపథ్ అనేది 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపు యువకుల కోసం కాగా, నిన్నటి హింసాకాండలో ఆర్మీ వయోపరిమితితో సంబంధంలేని రీతిలో 30 ఏళ్ల వారు పాల్గొన్నట్టు సమాచారం ఉందని విజయశాంతి వెల్లడించారు. 

కేంద్రం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా ఇంత హింస సృష్టించారంటే ఇది కచ్చితంగా ఆర్మీ ఆశావహుల పనికాదన్న విషయం స్పష్టమవుతోందని వివరించారు. ఇది తప్పకుండా బీజేపీ వ్యతిరేకులు కుట్రపన్ని చేయించిన పనే అని ఆరోపించారు. నిజాలు త్వరలోనే బయటికి వస్తాయని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.
Vijayashanti
Violence

More Telugu News