పదో తరగతి విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్.. మధ్యలో ఎంటరైన వల్లభనేని వంశీ, కొడాలి నాని

పదో తరగతి విద్యార్థులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే, జూమ్ మీటింగ్ నడుస్తుండగానే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నానిలు మధ్యలో ఎంటరయ్యారు. 

వంశీ ఆఫీసులోనే ఉండి ఓ విద్యార్థిని లాగిన్ అయింది. దీంతో ఆయన ఈజీగా మీటింగ్ లోకి ప్రవేశించారు. లోకేశ్ తో మాట్లాడే వంతు ఆ విద్యార్థినికి వచ్చిన సందర్భంలో వల్లభనేని వంశీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఆ జూమ్ మీటింగ్ లోకి సడన్ గా ప్రవేశించారు.
వాళ్లిద్దరూ ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ లో వాళ్లు కనిపించడంతో ఇటు టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా, వంశీ జూమ్ మీటింగ్ లోకి ఎంటరవ్వగానే నిర్వాహకులు ఆ లైన్ వీడియోను కట్ చేశారు. 

కాగా, పదో తరగతి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే.. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలినవ్వులతో శాడిజం చూపించారంటూ టీడీపీ మండిపడింది. నీచ రాజకీయానికి ఇదా సమయమంటూ ట్వీట్ చేసింది.

Nara Lokesh
Vallabhaneni Vamsi
Kodali Nani
Zoom
Tenth Students
Andhra Pradesh
Telugudesam

More Telugu News