జన సైనికులను బెదిరిస్తే దీటుగా సమాధానం చెబుతాం: నాగబాబు
- అధికార మదంతో వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్న నాగబాబు
- జనసేనపై అసత్య ప్రచారాలను సహించమని హెచ్చరిక
- ఉత్తరాంధ్రలో జనసేనకు బలమైన పునాది ఉందని వ్యాఖ్య
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న నాగబాబు శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికార మదంతో చాలా చోట్ల జన సైనికులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.
పదవులను అడ్డం పెట్టుకుని బరి తెగించి ప్రవర్తిస్తున్న వైసీపీ నేతలకు తగిన రీతిలో గట్టిగా సమాధానం చెబుతామని నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు బలమైన పునాదులు ఉన్నాయని, వాటిని కదిలించే సత్తా ఎవరికీ లేదని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర జనసైనికులు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావజాలంతోనే ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.