Jagga Reddy: హెటిరో పార్థసారథి వెంటపడి.. ఆయన సంగతి చూస్తాం: జగ్గారెడ్డి

ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో అధినేత పార్థసారథిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్థసారథి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

కరోనా సమయంలో నరహంతకుడి పాత్ర పోషించిన వ్యక్తి పార్థసారథి అని అన్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ల అమ్మకాలలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ ఫార్మా సంస్థ డబ్బులు వాడుకునేందుకు ఆయనను కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి కుంభకోణాలు జరగవని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదనే కుట్రలో పార్థసారథి కూడా భాగస్వామి అయ్యారని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్థసారథి వెంటపడి, ఆయన సంగతి తేలుస్తామని అన్నారు. 

రెమిడిసివిర్ ఒక్కో ఇంజెక్షన్ ను రూ. లక్ష వరకు అమ్మారని చెప్పారు. హెటిరోపై ఐటీ దాడులు జరిగినప్పుడు ఏం జరిగిందనే విషయం కూడా బయటకు రాలేదని.. అప్పుడు బయటపడింది రూ. 500 కోట్లు కాదని, రూ. 10 వేల కోట్లని అన్నారు. ప్రజల ప్రాణాలతో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
Jagga Reddy
Congress
KCR
TRS
Parthasarathi
Hetero

More Telugu News