Subhashini: తమిళ టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?
బుల్లితెర నటి సుభాషిణి (36) ఆత్మహత్య ఘటన చెన్నైలో కలకలం సృష్టించింది. భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో జరిగిన వాగ్వాదం ఈ దారుణానికి దారితీసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. చెన్నై పోరూరులోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సుభాషిణి, ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీలంకకు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్తో కలిసి బెంగళూరులో ఉండేది. అయితే వృత్తిరీత్యా షూటింగ్ల కోసం చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటోంది. ప్రముఖ టీవీ సీరియల్ 'కయల్' ద్వారా ఆమె మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మనస్థాపానికి గురైన ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారని, అదే ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతం పోరూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ వీడియో కాల్ లో జరిగిన సంభాషణలు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆమె అభిమానులు, తోటి నటీనటులు దిగ్భ్రాంతికి గురయ్యారు.