మాకు స్వల్పకాలిక లక్ష్యాలు.. దీర్ఘకాలిక దృష్టి ముఖ్యం: నీతా అంబానీ

Nita Ambani On IPL Auction
  • జోఫ్రా ఆర్చర్ ను తీసుకోవడంపై వివరణ
  • అభిమానుల మొహాల్లో సంతోషం చూడాలన్నదే మా తాపత్రయం
  • రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ కావడం సంతోషకరమన్న నీతా 
గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్ ను తీసుకోవడం వెనుక కారణాన్ని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ వివరించారు. తమకు స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక దృష్టి ఉంటాయని ఆమె చెప్పారు. రాబోయే లీగ్ లో అతడు ఆడకపోయినా.. దీర్ఘకాలంలో అతడి వల్ల కలిగే ప్రయోజనాలను జట్లు కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాయనడంలో సందేహం లేదన్నారు.

వేలంలో కొనుగోలు చేసిన కొందరు ప్లేయర్లను దీర్ఘకాలిక దృష్టిలోనే తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. అభిమానులు సంతోషించే నిర్ణయాలనే వేలంలో తీసుకున్నామని చెప్పారు. ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకునే వేలంలో పాల్గొన్నామని, ఇప్పుడు అభిమానులందరి మొహాల్లోనూ ఆనందం చూడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఇలాంటి మెగా వేలాలు చాలా చాలా కష్టంతో కూడుకున్నవని ఆమె అన్నారు.

ఒకే కుటుంబం వంటి ఆటగాళ్లను వదులుకోవడం కష్టమైనపనేనని, వాళ్లందరికీ దూరం కావడం బాధగా ఉందని పేర్కొన్నారు. హార్దిక్ గానీ, కృనాల్ గానీ, క్వింటన్ డికాక్, బౌల్ట్ గానీ అందరినీ మిస్ అవుతున్నామన్నారు. వాళ్లందరినీ జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించామన్నారు. అయితే, ప్రస్తుతం వేలంలో దక్కిన టీమ్ తో చాలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు.
 
తమ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ కావడం గర్వకారణంగా ఉందన్నారు. ఐపీఎల్ మూడో సీజన్ తర్వాతే రోహిత్ ను తీసుకున్నామని, ఆ తర్వాత అతడు జట్టు కెప్టెన్ గా ఎదిగాడని, ఇప్పుడు టీమిండియాకే కెప్టెన్ అయ్యాడని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇక, ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పుడు ఆడుతున్న యువ ఆటగాళ్లంతా భవిష్యత్ లో టీమిండియా స్టార్లుగా ఎదుగుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nita Ambani
IPL
Auction
Rohit Sharma
Mumbai Indians

More Telugu News