Nara Lokesh: ‘హెచ్‌ఎస్‌బీసీ’ని పూర్తిగా మూసేసిన యాజ‌మాన్యం.. వార్త‌ను పోస్ట్ చేస్తూ నారా లోకేశ్ విమ‌ర్శ‌లు

nara lokesh slams jagan
షార్ట్స్‌లో చూడండి
విశాఖ సిరిపురం జంక్షన్‌లోని ‘హెచ్‌ఎస్‌బీసీ’ బ్యాంకు చరిత్ర పుటల్లో కలిసిపోయిందంటూ 'ఆంధ్ర‌జ్యోతి' దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ కంపెనీని యాజమాన్యం పూర్తిగా మూసేసిందని, భవనం ఖాళీ అయిపోయిందని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

ఆ ప్రాంగణం ఇప్పుడు వెలవెలబోతోందనీ, అంతర్జాతీయ బ్యాంకింగ్‌ రంగంలో పేరు పొందిన‌ హెచ్ఎస్‌బీసీ వివిధ దేశాల్లో తన బ్యాంకులకు ఇక్కడి నుంచే సేవలు అందించేదని, యువ‌త‌కు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిందని అందులో పేర్కొన్నారు. ఆయా అంశాల‌ను నారా లోకేశ్ ప్ర‌స్తావించారు.

'సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది. 15 ఏళ్ల నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్‌బీసీ మూతపడటం బాధాకరం' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకి నిదర్శనం. మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు' అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
'విశాఖని దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలి' అని నారా లోకేశ్ సూచించారు.
Go Back to Shorts
Nara Lokesh
YSRCP
Andhra Pradesh

More Telugu News