Colonel Santosh Babu: కర్నల్ సంతోష్ బాబుకు మహావీరచక్ర.. మరణానంతర పురస్కారాన్ని అందుకున్న తల్లి, భార్య

Colonel Santosh Babu Mother and Wife Receive Post Humous Mahavira Chakra
  • ఇవాళ రాష్ట్రపతి భవన్ లో పురస్కారాల ప్రదానం
  • సైనికులకు గ్యాలంట్రీ అవార్డులు
  • గల్వాన్ లో వీరమరణం పొందిన సంతోష్ బాబు
కర్నల్ సంతోష్ బాబును కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది. మరణానంతర అవార్డును ప్రకటించింది. ఇవాళ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన భార్య సంతోషి, తల్లి అవార్డును అందుకున్నారు.

‘‘ఆపరేషన్ స్నో లియోపార్డ్ లో భాగంగా 16 బీహార్ రెజిమెంట్ కు నాయకత్వం వహిస్తున్న కర్నల్ బికుమళ్ల సంతోష్ బాబు గల్వాన్ లోయలో శత్రువుతో పోరాడి అమరుడయ్యారు. అప్పగించిన పనిని ఆయన విజయవంతంగా చేశారు. తన బలగాలను సిద్ధం చేశారు. వైరి దేశ సైనికులతో జరిగిన ఫేసాఫ్ లో వారిని అడ్డుకున్నారు. రాళ్ల దాడులు, మారణాయుధాలతో విరుచుకుపడిన శత్రు మూకలను ఎదురొడ్డి అడ్డగించారు. ఆ క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయినా వారితో పోరాడారు. తుది శ్వాస వరకు ముందుండి తన బృందాన్ని నడిపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో ధైర్య సాహసాలను ఆయన ప్రదర్శించారు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు’’ అని అవార్డుతో పాటు ఇచ్చిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.

కాగా, నాయబ్ సుబేదార్ నుదురాం సోరెన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయ్ గుర్తేజ్ సింగ్ లకు వీరచక్ర అవార్డును అందించనున్నారు. గత ఏడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ సైనికులను సంతోష్ బాబు టీం నిలువరించింది. ఆ క్రమంలో సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు.
Colonel Santosh Babu
Army
Gallantry Award
Maha Vira Chakra
New Delhi
Ram Nath Kovind

More Telugu News