YS Vivekananda Reddy: వైయస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్ రెడ్డిని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించిన సీబీఐ!

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా... కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను అరెస్ట్ చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్సలను పూర్తి చేసిన తర్వాత ఈ తెల్లవారుజామున సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటి దగ్గర ఆయనను హాజరుపరిచారు. అనంతరం శివశంకర్ రెడ్డిని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ఈరోజు ఆయనను పులివెందుల కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

దస్తగిరి వాంగ్మూలం తర్వాత ఈనెల 15న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ శివశంకర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలతో విచారణకు రాలేకపోతున్నానని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది.

మరోవైపు సీబీఐకి శివశంకర్ రెడ్డి కుమారుడు లేఖ రాశారు. వివేకా హత్యతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే తన తండ్రి భుజానికి ఆపరేషన్ జరిగిందని, నొప్పితో ఆయన ఇంకా బాధపడుతున్నారని, ఆయన సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని సీబీఐ అధికారులను కోరారు.
YS Vivekananda Reddy
Murder
CBI
YS Avinash Reddy
Siva Shankar Reddy

More Telugu News