Byreddy Rajasekar Reddy: కొడాలి నాని మాటలు మనం వినగలమా?... టీడీపీ నేతలు కూడా అలాగే మాట్లాడుతున్నారు!: బైరెడ్డి

బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ సరళిపై స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాషపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడే మాటలు మనం వినగలమా? అంటూ వ్యాఖ్యానించారు. అటు టీడీపీ నేతలు సైతం అభ్యంతరకర రీతిలో మాట్లాడుతున్నారని బైరెడ్డి విమర్శించారు. ఇటీవల రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే సీమ ప్రాంతంలో ఉపయోగించే అన్ని తిట్లు ప్రయోగించాడని వివరించారు.

అసెంబ్లీలో చర్చల నుంచి బహిరంగ సమావేశాల వరకు ఎక్కడా రాజకీయ నేతల మాటల్లో హుందాతనం కనిపించడంలేదని అన్నారు. కొడాలి నానితో తనకు పరిచయం లేదని, కానీ నాలుకను అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నానని తెలిపారు.

"మీ తిట్లు చూసి పిల్లలు చెడిపోతార్రా నాయనా! ఒకాయన వచ్చి బోషడీకే అంటాడు... మరొకాయన వచ్చి బోషడీకే అంటే అర్థం ఇదీ అని వివరిస్తాడు. ఈయనేమన్నా తిట్లలో పండితుడా? తెలంగాణ భాష కానీ, రాయలసీమ భాష కానీ, కోస్తాంధ్ర భాష కానీ ఎంతో చక్కని భాషలు. కానీ కొత్త కొత్త భాషావేత్తలు పుట్టుకొస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం" అని బైరెడ్డి అభివర్ణించారు.
Byreddy Rajasekar Reddy
Kodali Nani
Language
TDP
Andhra Pradesh

More Telugu News