Union Govt: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారికి రూ.5 వేలు... కేంద్రం ప్రకటన

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తొలి గంట కీలకం అని చెబుతారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది.

తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు.

ఈ పథకంలో భాగంగా.... ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు.

అలాకాకుండా, రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
Union Govt
New Scheme
Road Accident
Help
Saviors
Cash Reward
Police
India

More Telugu News