Abdulla Shahid: నేను భారత్ లో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సినే తీసుకున్నా: ఐరాస సాధారణ సభ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్

ఐక్యరాజ్య సమితి 76వ సాధారణ సభ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భారత్ లో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్ నే తీసుకున్నానని వెల్లడించారు. కొవిషీల్డ్ రెండు డోసులు వేయించుకున్నానని తెలిపారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ ను భారత్ లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.

దీనిపై అబ్దుల్లా షాహిద్ మాట్లాడుతూ, "భారత్ లో తయారైన కొవిషీల్డ్ నే వేయించుకున్నా. అయితే ఎన్ని దేశాలు కొవిషీల్డ్ తమకు ఆమోదయోగ్యం అంటాయో, ఆమోదయోగ్యం కాదంటాయో తెలియదు. చాలా దేశాల్లో కొవిషీల్డ్ నే వాడుతున్నారని భావిస్తున్నారు" అని వివరించారు. డబ్ల్యూహెచ్ఓ గానీ, మరే ఇతర ప్రపంచ సంస్థ గానీ గుర్తించిన వాటిలో ఏదైనా ఒక కరోనా వ్యాక్సిన్ ను ఐరాస సిఫారసు చేస్తుందా? అన్న ప్రశ్నకు అబ్దుల్లా షాహిద్ పైవిధంగా సమాధానమిచ్చారు.

"వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి నా వరకు నేను బతికి బయటపడ్డాను... అయినా ఓ వైద్య నిపుణుడ్ని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎలా?" అంటూ షాహిద్ నవ్వేశారు.
Abdulla Shahid
Covishield
Vaccine
Corona Virus
UN General Assembly

More Telugu News