Payam Venkateswarlu: ఓటర్లకు డబ్బు పంపిణీ కేసులో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలల జైలు శిక్ష

  • తీర్పు చెప్పిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం
  • రూ. 10 వేల జరిమానా చెల్లించి అప్పీలుకు అవకాశం కోరిన ‘పాయం’
  • అనుమతించిన న్యాయస్థానం.. అప్పటి వరకు శిక్ష నిలిపివేత
6 months jail to pinapaka ex mla payam venkateswarlu

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. నిన్న ఈ కేసును విచారించిన హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వెంకటేశ్వర్లును దోషిగా నిర్ధారించింది. ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.

ఆ ఎన్నికల్లో గద్దల నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా పాయం వెంకటేశ్వర్లు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయనతోపాటు పాయంపైనా కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు ఇద్దరికీ జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధించింది. దీంతో పాయం వెంకటేశ్వర్లు రూ. 10 వేల జరిమానా చెల్లించారు. అనంతరం జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు కోర్టును కోరారు. అనుమతించిన న్యాయస్థానం జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

More Telugu News