షర్మిలకు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష
  • షర్మిల పోరాటం విజయవంతం కావాలని కోమటిరెడ్డి ఆకాంక్ష
  • నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపాటు
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈరోజు నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంలలో నిరాహార నిరుద్యోగ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె దీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన షర్మిలకు ఫోన్ చేశారు. ఆమెకు తన మద్దతును ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్యలపై పోరాడేవారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.

నిరుద్యోగుల కోసం షర్మిల చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని కోమటిరెడ్డి ఆకాంక్షించారు. నిరుద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ దారుణంగా మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడాన్ని మానేసి... సొంత కుటుంబం కోసం ఆలోచిస్తున్నారని అన్నారు. రాజన్న బిడ్డగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం సంతోషకరమని చెప్పారు. ఆమెకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

Komatireddy Raj Gopal Reddy
Congress
Sharmila
YSRTP

More Telugu News