మీరు మీ తండ్రి నిర్ణయానికి పూర్తిగా విరుద్ధంగా వెళుతున్నారు: జగన్కు రఘురామ లేఖ
- తెలుగు భాషను చిదిమేయాలనే మంకుపట్టు వద్దు
- కోర్టులో వేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలి
- తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి
- పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యా బోధన జరపాలని వైఎస్సార్ నిర్దేశించారు
'మీ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన చట్టం గురించి తెలుసుకున్నా కూడా మీరు తెలుగు భాషను అంతం చేయాలనే నిర్ణయం తీసుకోరు. విద్యా హక్కు చట్టం 2009ని అమలు చేయడంలో భాగంగా రాజశేఖర్ రెడ్డి నిర్బంధ ఉచిత విద్యా చట్టం 2010 తీసుకొచ్చారు. ఆ చట్టంలో చాలా స్పష్టంగా పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యా బోధన జరపాలని నిర్దేశించారు. అయితే, మీరు మీ తండ్రి నిర్ణయానికి పూర్తిగా విరుద్ధంగా వెళ్తున్నారు. తెలుగు సరిగ్గా నేర్చుకోకపోవడం, తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవడం తెలుగు భాషను అవమానించడమే కాదు. మన కన్నతల్లిని అవమానించడం లాంటిది' అని రఘురామ విమర్శించారు.