ఈ తీరు చూస్తుంటే 'మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోంది: జగన్కు రఘురామ లేఖ
- పేదవారి ఇళ్లకు శంకుస్థాపనలు పదే పదే చేస్తున్నారు
- వర్చువల్ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
- యమలీల సినిమాలోని డైలాగు గుర్తు వస్తోంది
- ఇప్పటికైనా పేదలకు ఇళ్లు ఇవ్వాలి
ఏపీలో 31 లక్షల కుటుంబాల కోసం 17,000 కాలనీలు నిర్మించాలని ప్రణాళికలు వేశారని అందులో రఘురామ తెలిపారు. ముందుగా రూ.56,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం అనంతరం మాత్రం దాన్ని రూ.70,000 కోట్లకు పెంచిందని చెప్పారు. మరికొన్ని గృహాలకు శంకుస్థాపన చేయబోతున్నామంటూ వర్చువల్ విధానంలోనే ఇప్పటికే నాలుగు సార్లు కార్యక్రమాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల చిత్రంలోని 'మా చెల్లి పెళ్లి...జరగాలి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ గుర్తుకు వస్తోందని చురకలంటించారు. రాష్ట్రంలో అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని రఘురామ కృష్ణరాజు సూచించారు. పేదవారికి ఇళ్లు ఇచ్చే విషయంలో సరైన రీతిలో వ్యవహరించాలని కోరారు.