Raghu Rama Krishna Raju: ఏపీ సీఎం జ‌గ‌న్‌కు రఘురామకృష్ణరాజు మ‌రో లేఖ

raghu rama writes letter to jagan
  • నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో లేఖ‌
  • సర్పంచ్‌ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు
  • సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై స్పష్టత లేదు
  • బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేక నిస్సహాయంగా మారారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు మ‌రో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయ‌న రాసిన ఈ లేఖ‌లో సర్పంచ్‌ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై స్పష్టత లేద‌ని, దీంతో బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేక నిస్సహాయంగా మారారని ఆయ‌న చెప్పారు.

అలాగే, గ్రామ సభ క్రియాశీలత్వం కోల్పోయి లాంఛనప్రాయంగా మారిందని ఆయన అన్నారు. నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పంచాయతీలను వైసీపీ స‌ర్కారే బలహీన పరుస్తోందనే భావన ప్రజల్లో ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

దీంతో స‌ర్కారుపై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నమ్మకం పోతోందని ఆయ‌న చెప్పారు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారని ఆయ‌న అన్నారు. వారిలో ఉన్న అసంతృప్తిని ఏదో ఒక రోజున  బయట పెడ‌తార‌ని తెలిపారు. సర్పంచ్‌లకు ఉండాల్సిన‌ అన్ని అధికారాలు ఇస్తూ నిర్ణ‌యం తీసుకోవాల‌ని అన్నారు.

Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh
Jagan

More Telugu News