టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్

  • ఇటీవల మరణించిన ఇందూ జైన్
  • కరోనా ఇన్ఫెక్షన్ తో మృతి
  • వర్చువల్ విధానంలో సంస్మరణ కార్యక్రమం
  • నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
ప్రఖ్యాత టైమ్స్ గ్రూప్ (బెన్నెట్ అండ్ కోల్ మన్) మీడియా సంస్థ చైర్ పర్సన్ ఇందూ జైన్ ఇటీవల కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. మహిళల వ్యాపార దక్షతను ఘనంగా చాటిన ఇందూ జైన్ అనేక పురస్కారాలు అందుకున్నారు. 2016లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రదానం చేసి గౌరవించింది. కాగా, ఇవాళ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఇందూ జైన్ కు నివాళులు అర్పించారు.

కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడిన ఇందూ జైన్ కు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ఆమె కోలుకోలేకపోయారని టైమ్స్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఫిక్కీ మహిళల విభాగం స్థాపనలోనూ, టైమ్స్ ఫౌండేషన్ పేరిట దాతృత్వ సేవలకు ఇందూ జైన్ ఆద్యురాలు. ఆమెకు ఆధ్యాత్మిక భావనలు మెండు.

ఆమె 1936లో ఓ జైన కుటుంబంలో జన్మించారు. ఆమె అశోక్ కుమార్ జైన్ ను పెళ్లాడారు. అశోక్ కుమార్ టైమ్స్ గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన  మరణానంతరం ఇందూ జైన్ సంస్థ బాధ్యతలను పర్యవేక్షించారు.

Jagan
Indu Jain
Obituary
Times Group
Chair Person

More Telugu News