ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి జూన్ నుంచి వ్యాక్సినేషన్

 Vaccination drive for 18 years above will start in july in Andhrapradesh
  • టీకా పంపిణీ కోసం కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం
  • రిజిస్ట్రేషన్ సమయాన్ని త్వరలో ప్రకటిస్తాం
  • 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందించాం
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే, ఏపీలో మాత్రం జూన్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారు పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలన్న సమయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తామని సింఘాల్ తెలిపారు. వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిన్న 11,453 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 32,810 ఇంజక్షన్లు ఉన్నట్టు చెప్పారు. 4 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని, ఈ వారంలో మరో 50 వేలు వస్తాయని సింఘాల్ వివరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Vaccination

More Telugu News