Corona Virus: ఏపీ సచివాలయంలో కరోనాతో నలుగురి మృతి... హైకోర్టులోనూ మహమ్మారి పంజా

  • రాష్ట్రంలో కరోనా మృత్యుఘంటికలు
  • సచివాలయంలో వందకు పైగా పాజిటివ్ కేసులు!
  • పలు విభాగాల్లో కరోనా వ్యాప్తి
  • వేర్వేరు సెక్షన్లలో పనిచేస్తున్న భార్యాభర్తల మృతి
  • ప్రభుత్వానికి లేఖ రాసిన ఉద్యోగుల సంఘం
  • ఏపీ హైకోర్టులోనూ ఇద్దరు బలి
Corona deaths in AP Secretariat

ఏపీలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో మరింత భీకర రూపు దాల్చిన ఈ వైరస్ రక్కసి భారీగా ప్రాణాలను బలిగొంటోంది. ఏపీ సచివాలయంలో నలుగురు ఉద్యోగులు కరోనాతో మృత్యువాత పడడం భీతిగొలుపుతోంది. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఆ నలుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

ఏఎస్ఎన్ మూర్తి (హోంశాఖ అసిస్టెంట్), శాంతకుమారి (పంచాయతీరాజ్ సెక్షన్ ఆఫీసర్), వి.పద్మారావు (అసిస్టెంట్ సెక్రటరీ), జి.రవికాంత్ (సెక్షన్ ఆఫీసర్-సాధారణ పరిపాలన శాఖ) కరోనాకు బలయ్యారు. వీరిలో శాంతకుమారి, పద్మారావు భార్యాభర్తలు. ఇద్దరూ కూడా ఒక్కరోజు వ్యవధిలో మృతిచెందడంతో సచివాలయ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. ఉద్యోగులంతా భయాందోళనలతో ఉన్నారని పేర్కొంది. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

అటు, ఏపీ హైకోర్టులోనూ ఇద్దరు ఉద్యోగులు కరోనా రక్కసి చేతచిక్కి ప్రాణాలు విడిచారు. టైపిస్టుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీలత కరోనా చికిత్స పొందుతూ మరణించారు.

More Telugu News