Tamilnadu: రీ పోలింగ్ జరపాల్సిందే: కమలహాసన్ డిమాండ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిన్న ముగియగా, తాము రీపోలింగ్ కోరనున్నామని మక్కల్ నీది మయ్యమ్ అధినేత, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కమలహాసన్ వెల్లడించారు. తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి వచ్చి మైలాపురంలో ఓటు వేసిన ఆయన, ఆపై తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్ లో ఓటింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు వెళ్లారు.

 అక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో నోట్లు, టోకెన్లను ఓటర్లకు పంపిణీ చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు ఎవరు పంచారన్న విషయమై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వీటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి, రీపోలింగ్ కు డిమాండ్ చేయనున్నానని కమల్ తెలిపారు. తమిళనాడులోని ఎన్నో నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగిందని అన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈసీ విఫలం అయిందని అన్నారు. ఈసీ రీపోలింగ్ కు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Tamilnadu
Assembly
Kamal Haasan
Sruthi Hasan
Re poling

More Telugu News