Sai Pallavi: నితిన్ తదుపరి సినిమాలో జోడీగా సాయిపల్లవి?

యంగ్ హీరో నితిన్ కూడా ఇప్పుడు స్పీడు మీదే వున్నాడు. సినిమాల మధ్య గ్యాప్ అన్నది లేకుండా ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. అది కూడా వేటికవే వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఆమధ్య హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 'మాస్ట్రో'  అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. దీనిని జూన్ 11న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు  అధికారికంగా కూడా ప్రకటించేశారు.

ఇక దీని తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వం వహించే 'పవర్ పేట' చిత్రం సెట్స్ కి వెళుతుంది. ఇందులో నితిన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ను పోషిస్తాడు. ఆ తర్వాత చేయబోయే చిత్రాన్ని కూడా నితిన్ అప్పుడే సెట్ చేసుకున్నాడు. ఆమధ్య అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' అనే చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దీనికి దర్శకత్వం వహిస్తాడట. ఇక ఇందులో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. మరి, ఈ జంట వెండితెరపై ఎటువంటి సందడి చేస్తుందో చూడాలి!
Sai Pallavi
Nithin
Vakkamtam
Merlapaka Gandhi

More Telugu News