చత్తీస్ గఢ్ లో పెద్ద సంఖ్యలో జవాన్లను మావోలు ఎలా చంపగలిగారంటే..!

This is how naxals kills huge number of Jawans
  • సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో రక్తసిక్తం
  • పెద్ద సంఖ్యలో జవాన్లు మృతి
  • యు ఆకారంలో దాడి చేసిన మావోలు
  • తప్పించుకోలేకయిన జవాన్లు
  • దాడిలో పాల్గొన్న 600 మంది నక్సల్స్
చత్తీస్ గఢ్ లో భద్రతాబలగాలపై మావోయిస్టులు విరుచుకుపడిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన భద్రతా దళాలకు ఈ దాడిలో అత్యధిక నష్టం వాటిల్లడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు 24 మంది జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంపై గట్టి పట్టున్న మావోయిస్టులు ఓ పద్ధతి ప్రకారం భద్రతా బలగాలపై దాడి చేశారు. కూంబింగ్ ఆపరేషన్ లో ఉన్న భద్రతా బలగాలు తామున్న ప్రాంతానికి వస్తాయని ముందే ఊహించిన నక్సల్స్ అందుకు తగిన విధంగా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.

400 మందితో కూడిన భద్రతాబలగాల కూంబింగ్ బృందం తరెం ఏరియాలో ప్రవేశించింది. అయితే తమకు అనువుగా ఉండే ప్రాంతంలోకి భద్రతాబలగాలు వచ్చే దాకా వేచిచూసిన నక్సల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాదాపు 600 మంది నక్సల్స్ 'యు' ఆకారంలో మోహరించి ఏకే-47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, ఐఈడీ పేలుడు పదార్థాలతో విరుచుకుపడ్డారు. ఈ తరహా మోహరింపునే 'అంబ్రెల్లా ఫార్మేషన్' అంటారు.

మావోల వ్యూహం గురించి భద్రతా బలగాలు పసిగట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూడు వైపుల నుంచి దాడి జరగడంతో భద్రతా బలగాలు స్పందించడానికి తగిన సమయం చిక్కలేదు. ఏ దిశగా కాల్పులు జరపాలని నిర్ణయం తీసుకునేలోపే పెద్దసంఖ్యలో భద్రతా సిబ్బంది మావోల తూటాలకు నేలకొరిగారు. 100 నుంచి 200 మీటర్ల దూరం నుంచే మావోలు దాడి చేయడంతో తప్పించుకోవడం భద్రతా బలగాలకు కష్టసాధ్యమైంది. తేరుకున్న భద్రతా దళాలు కూడా ఎదురుదాడికి దిగినా మావోలకు జరిగిన నష్టం స్వల్పమే. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందినట్టు భావిస్తున్నారు.
Go Back to Shorts
Naxals
Security Forces
Encounter
Umbrella Formation
Chhattisgarh

More Telugu News