Kanimozhi: మీరు వంట చేస్తారా? అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధి... కనిమొళి జవాబు ఇదిగో!

DMK MP Kanimozhi responds to media reporter question if she cooks
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియాలో డీఎంకే మహిళా ఎంపీ కనిమొళికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మీరు వంట చేస్తారా అని ప్రశ్నించిన మీడియా రిపోర్టర్ కు కనిమొళి జవాబు ఇచ్చిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. జాతీయ మీడియా చానల్ కు చెందిన ఓ రిపోర్టర్ ఓ ఇంటర్వ్యూలో కనిమొళి వంట గురించి ప్రశ్నించాడు. "మీరు ఎంపీ కదా... వంట చేస్తారా?" అని ప్రశ్నించాడు. దాంతో కనిమొళి చిరునవ్వుతోనే బదులిచ్చారు. "ఇదే ప్రశ్నను మీరు పురుష రాజకీయ నేతలను ఎందుకు అడగరు?" అని అన్నారు.

దాంతో ఆ రిపోర్టర్ "మీరు ఎంపీగా ఉన్నారు, లోక్ సభలో డీఎంకే ఉప సభాపక్ష నేతగా ఉన్నారు కదా... అందుకే అడిగాను" అంటూ స్పందించాడు. ఈసారి కనిమొళి మరింత చురుగ్గా బదులిచ్చారు. "మా నాన్న గతంలో ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఈ ప్రశ్న ఆయన్ను ఎందుకు అడగలేదు?" అంటూ తిరిగి ప్రశ్నించారు. దాంతో ఆ రిపోర్టర్ ఇంకేం అడగాలో తెలియక నవ్వేశాడు. ఆపై కనిమొళి మాట్లాడుతూ, తనకు వంట చేయడం వచ్చని వెల్లడించారు.

ఆ వెంటనే యాంకర్ మాట్లాడుతూ, 'మీ నాన్నగారికి చేపల కూర అంటే బాగా ఇష్టం కదా, మరి ఎప్పుడైనా ఆయన కోసం అది వండారా?' అంటూ అడిగాడు. తన తండ్రి కరుణానిధి కోసం గతంలో చేపల కూర వండానని, ఆయన మెచ్చుకున్నారని తెలిపారు. అయితే, అమ్మ వండిన కూరనే నాన్న బాగా ఇష్టపడతారని కనిమొళి పేర్కొన్నారు. కూతుర్ని కాబట్టి తాను చేసిన కూరను కూడా ఆయన కాదనలేకపోయారని, తండ్రులందరూ కుమార్తెల వంటను ఇష్టపడతారని వివరించారు.
Go Back to Shorts
Kanimozhi
Media Reporter
Cooking
DMK
Karunanidhi

More Telugu News