రైతులు, కేంద్రం మధ్య నేడు మరో విడత చర్చలు.. వ్యూహాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం
- నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే రైతుల ప్రధాన డిమాండ్
- సవరణలకు అంగీకరించబోమంటూ లేఖ
- చర్చల నేపథ్యంలో షాతో మంత్రుల భేటీ
సవరణలకు తాము అంగీకరించబోమని రైతు సంఘాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. నిన్న కేంద్రానికి రాసిన లేఖలోనూ రైతు సంఘాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. నూతన చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు మరో రెండు అంశాలపై మాత్రమే తాము చర్చిస్తామని తేల్చి చెప్పాయి.
మరోవైపు, చర్చల నేపథ్యంలో రైతు సంఘాలు నేడు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని రేపటికి వాయిదా వేశారు. చర్చల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోం ప్రకాశ్లు నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే, వారు ఏం చర్చించారన్న విషయాలు వెల్లడికాలేదు.