Tamil Nadu: వారందరూ అవినీతిపరులే.. కనీసం మీరైనా చర్యలు తీసుకోండి: అన్నాడీఎంకే ప్రభుత్వంపై గవర్నర్‌కు డీఎంకే ఫిర్యాదు

DMK Complain against Palaniswamy govt
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి పళనిస్వామితోపాటు మంత్రివర్గం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష డీఎంకే పార్టీ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీఎంకే చీఫ్ స్టాలిన్ నేతృత్వంలోని నేతలు నిన్న ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 97 పేజీలతో వినతిపత్రం అందజేశారు.  

అనంతరం రాజ్‌భవన్ బయట స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పళనిస్వామి తన సంపాదనకు మించి రూ.200.21 కోట్ల విలువైన 19 ఆస్తులను సంపాదించారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం దుర్వినియోగం చేశారన్నారు. రహదారుల శాఖలో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఆరు వరుసల రహదారికి సంబంధించిన రూ.6133.57 కోట్ల టెండర్లను తన బంధువులకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.450 కోట్ల మేర నష్టాన్ని కలిగించారన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి తంగమణి బొగ్గు దిగుమతి, నకిలీ విద్యుత్‌ లెక్కలతో రూ.950.26 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ఆ శాఖలో నియామకాలు, బదిలీలకు రూ.20.75 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని, రెవెన్యూ మంత్రి  ఉదయకుమార్‌ భారత్‌ నెట్‌ టెండర్లను కేటాయించడంలో రూ.1950 కోట్లకు పైగా అవినీతి పాల్పడ్డారని, మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ జాలర్లకు వాకీటాకీల కొనుగోళ్ళలో రూ.30 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని స్టాలిన్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతిపై తాము ఏసీబీకి గతంలో ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని అన్నారు. అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఏసీబీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. అందుకనే తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని స్టాలిన్ పేర్కొన్నారు. తమ వినతి పత్రాన్ని గవర్నర్ పరిశీలించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
Go Back to Shorts
Tamil Nadu
DMK
AIADMK
Stalin
Edappadi Palaniswami
Governor

More Telugu News