Amaravati: ‘అమరావతి’ ఉద్యమానికి ఏడాది.. నేడు రాయపూడిలో భారీ బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జేఏసీ నేతలు ఏర్పాట్లు చేశారు. ‘జనరణభేరి’ పేరిట రాయపూడి వద్ద నిర్వహించతలపెట్టిన ఈ సభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది.

ఈ సభకు 30 వేల మంది వరకు హాజరవుతారని అంచనా. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్‌రెడ్డి, తులసిరెడ్డి తదితరులు హాజరు కానున్నారు.

జేఏసీ నాయకుల వినతిపై ‘జనరణభేరి’కి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సభ సందర్భంగా అల్లరిమూకలు గొడవలకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. మరోవైపు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ జనరణభేరి సభలోకి అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందన్నారు.
Amaravati
Farmers protest
Jana Rana Bheri
Andhra Pradesh

More Telugu News