హైదరాబాదులో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించకుండా అడ్డుకున్నాం: జాతీయ మీడియాతో కవిత

TRS stopped BJP in Hyderabad says Kavitha
  • వరుసగా నేతలను పిలిపించి ఓటర్లను కన్ఫ్యూజ్ చేశారు
  • బీజేపీని ఎలా ఎదుర్కోవాలో ఇతర ప్రాంతాల్లోని పార్టీలు తెలుసుకోవాలి
  • టీఆర్ఎస్ బలహీన పార్టీ కాదు
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకోవడంతో మేయర్ పీఠానికి టీఆర్ఎస్ పార్టీ చాలా దూరంలో నిలిచిపోయింది. ఎక్స్ అఫీషియో ఓట్లను కలుపుకున్నా గులాబీ పార్టీకి మేయర్ పీఠం దక్కదు. తన మిత్రుడు ఎంఐఎం మద్దతు తీసుకునే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పార్టీలో చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. పార్టీ అంచనాల కంటే తక్కువ స్థానాలు రావడంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపారు. కనీసం డజను స్థానాలు తమ అంచనాల కంటే తక్కువగా వచ్చాయని చెప్పారు.

వరుసగా ఢిల్లీ నుంచి నాయకులను హైదరాబాదుకు రప్పించి ఓటర్లను బీజేపీ కన్ఫ్యూజ్ చేసిందని కవిత అన్నారు. ప్రతి చోట బీజేపీ ఆచరించే వ్యూహం ఇదేనని విమర్శించారు. బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయో తమకు ఇప్పుడు అర్థమయ్యాయని... 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ మరో మెట్టు అధిరోహిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ బలహీన పార్టీ కాదని అన్నారు. 60 లక్షల మంది సభ్యత్వాలను కలిగిన తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు.

హైదరాబాదులో అతిపెద్ద పార్టీగా అవతరించకుండా బీజేపీని తాము అడ్డుకోగలిగామని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎలా అడ్డుకోవాలో హైదరాబాద్ చూపించిందని తెలిపారు. బీజేపీని ఎలా నిలువరించాలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పార్టీలు తెలుసుకోవాలని అన్నారు.

150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. మరో డివిజన్ ఫలితం హైకోర్టు ఆదేశాలతో ఆగిపోయింది. 149 సీట్లకు గాను టీఆర్ఎస్ 55 స్థానాల్లో గెలుపొందగా... బీజేపీ 48 స్థానాలలో జయకేతనం ఎగురవేసింది. ఎంఐఎం 44 సీట్లలో గెలుపొందింది.
Go Back to Shorts
K Kavitha
TRS
MIM
BJP
Hyderabad

More Telugu News