GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల పొత్తుపై జనసేన, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు!

Different statements from Janasena and BJP leaders on GHMC Elections
  • బీజేపీ నేతలు పవన్ ను కలవనున్నారని జనసేన ప్రకటన
  • జనసేనతో ఎలాంటి పొత్తు ఉండదంటున్న బండి సంజయ్
  • కార్యకర్తల్లో అయోమయం
తెలంగాణ రాజకీయాలన్నీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలతో తలమునకలుగా ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తుపై భిన్న ప్రకటనలు రావడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీచేయడంపై ఈ మధ్యాహ్నం జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చర్చిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ ను బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు కలవనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కానీ, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జనసేనతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. అటు, బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి కూడా ఇదే విషయం వెల్లడించారు. జనసేనతో పొత్తు విషయమై చర్చించడానికి బీజేపీ అగ్రనేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని, అయితే బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశానికి అంగీకరించలేదని అన్నారు.
GHMC Elections
Janasena
BJP
Pawan Kalyan
Bandi Sanjay
Hyderabad
Telangana

More Telugu News