సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ: సీఎం కేసీఆర్

  • సాదా బైనామా క్రయవిక్రయాలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్
  • ఉత్తర్వులు జారీ చేయాలంటూ సీఎస్ కు ఆదేశాలు
తెలంగాణలో ఇటీవలే నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా (భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రం)ల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్టు వెల్లడించారు. ఈ తరహా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని, సంబంధిత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని సీఎస్ ను ఆదేశించారు.

అంతకుముందు సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించారు. అనంతరం సీఎంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని వారు సీఎం కేసీఆర్ ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.

KCR
Lands
Regularization
Muncipalities
Corporations

More Telugu News