Kangana Raunat: నా నోరు మూయిస్తే సరిపోతుందా?... కోట్ల గొంతుకల సంగతేంటి?: ఉద్ధవ్ పై మరోసారి విరుచుకుపడిన కంగనా రనౌత్

Another Sharp Tweet from Kangana on Uddhav
షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై విరుచుకుపడుతున్న నటి కంగనా రనౌత్, మరోసారి మండిపడింది. అయితే, ఈ దఫా ఎవరి పేరునూ ఆమె వెల్లడించక పోవడం గమనార్హం. బీఎంసీ అధికారులు కంగన నిర్వహిస్తున్న మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేయగా, మొదలైన వివాదం మరింత పెద్దది కాగా, బీజేపీ నేతలు కంగనకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

శివసేనతో పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ పై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్న కంగన, తాజాగా, "మీ నాన్న చేసిన మంచి పనులతో మీకు సంపద లభించింది. మీ గౌరవాన్ని మాత్రం మీరే సంపాదించుకోవాలి. నా నోటిని మీరు మూయించవచ్చు కానీ, నా గొంతు కోట్లాది మందిలో ప్రతిధ్వనిస్తుంది. ఎందరి నోళ్లు మీరు మూయించగలరు? ఎంత మందిని నొక్కి పెట్టగలుగుతారు? ఎప్పుడైతే వాస్తవం నుంచి మీరు తప్పించుకోవాలని భావిస్తారో, అప్పుడు మీరు రాజవంశానికి నమూనాగా తప్ప ఇంకేమీ కాదన్న సంగతిని గుర్తెరగండి" అని ట్వీట్ పెట్టింది.

కాగా, ఈ వివాదం సుశాంత్ ఆత్మహత్య తరువాత కంగన చేసిన ట్వీట్ తో మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. కేసును విచారిస్తున్న ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని, ముంబై నగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మారిపోయిందని కంగన వ్యాఖ్యానించగా, శివసేన వర్గాలు మండిపడ్డాయి. తమ నగరంలో భద్రత లేకుంటే, ముంబైకే రావద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం, ఆపై కేంద్రం వై కేటగిరీలో కంగనకు భద్రతను కల్పిస్తూ, సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించిన సంగతి విదితమే.

ఆపై ఆమె, తనను ఏం చేస్తారో చేయండంటూ, నిన్న ముంబైలో కాలుమోపింది. ఇదిలావుండగా, ముంబైలో ఉన్న కంగన కార్యాలయం అక్రమ నిర్మాణమని నోటీసులు పంపిన బీఎంసీ అధికారులు, అందుకు సమాధానాన్ని కూడా ఇచ్చే సమయం ఇవ్వకుండా, గంటల వ్యవధిలోనే దాన్ని కూల్చివేయడం ప్రారంభించగా, హైకోర్టు ఈ కూల్చివేతలపై స్టే విధించింది. దీంతో వివాదం మరింత పెద్దదిగా మారగా, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కంగనకు మద్దతుగా నిలుస్తున్నట్టు ప్రకటించారు.
Go Back to Shorts
Kangana Raunat
Uddhav Thackeray
Maharashtra

More Telugu News