సాయం చేసిన వారికి సెల్యూట్ చేసిన పోలీసు... విచారణకు ఆదేశించిన అధికారులు!

  • కేరళలో విమానం కూలిన తరువాత సాయపడిన స్థానిక యువత
  • ఓ మృతుడికి కరోనా ఉండటంతో అందరూ క్వారంటైన్
  • వారి వద్దకు వెళ్లి సెల్యూట్ చేసిన అధికారి
కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం జరిగిన వేళ, అక్కడి సహాయక చర్యల్లో కొందరు పాల్గొని సాయం చేయగా, అందుకు కృతజ్ఞతగా, వారి ముందు నిలబడి ఓ పోలీసు అధికారి సెల్యూట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

కోజికోడ్ లో సీనియర్ పోలీసుగా ఉన్న ఎ.నిజార్ అనే వ్యక్తి, విమాన ప్రమాదం సమయంలో అక్కడే విధులు నిర్వహించారు. ఆ సమయంలో కొందరు స్థానిక యువకులు ఆయనకు తమవంతు సాయం చేశారు. ఇదే ప్రమాదంలో మరణించిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ సోకడంతో, వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్ చేశారు. వారు ఉన్న క్వారంటైన్ కేంద్రానికి వెళ్లిన నిజార్, వారి సేవలకు గుర్తుగా సెల్యూట్ చేశారు.

ఈ ఘటనపై స్పందించిన మలప్పురం పోలీస్ చీఫ్ అబ్దుల్ కరీమ్, పోలీసులు ఎవరికి సెల్యూట్ చేయాలన్న విషయమై ఏ విధమైన ప్రొటోకాల్స్ లేవని, నిజార్ చర్య చట్ట వ్యతిరేకమని చెప్పలేమని అన్నారు. అతనిపై ఎటువంటి చర్యలూ తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇక సామాజిక మాధ్యమాల్లో పోలీసు చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతుండగా, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా చేయడం తగదని ఓ వర్గం అంటోంది.

Kerala
Police
Selute
Enquiry

More Telugu News