మరో వారంలో రిటైర్మెంట్.. కరోనాతో కన్నుమూసిన హెడ్‌కానిస్టేబుల్!

  • ఈ నెల 30న రిటైర్ కావాల్సి వున్న హెడ్ కానిస్టేబుల్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ముంబైలో ఇప్పటి వరకు 31 మంది పోలీసుల బలి
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరో పోలీసును బలితీసుకుంది. ముంబైకి చెందిన పోలీసు ఒకరు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.58 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ రఘునాథ్ షిండే ఈ నెల 30న రిటైర్ కావాల్సి ఉండగా, కరోనా బారినపడిన ఆయన నాయర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు అధికారులు తెలిపారు.

దీంతో కరోనా కారణంగా మృతి చెందిన పోలీసుల సంఖ్య 31కి పెరిగింది. కాగా, ఇప్పటి వరకు ముంబైలో 2,349 మంది పోలీసులకు కరోనా సంక్రమించినట్టు ముంబై పోలీసు ప్రజాసంబంధాల శాఖ అధికారి ప్రణయ్ అశోక్ తెలిపారు. విధి నిర్వహణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


mumbai
Maharashtra
police
Corona Virus

More Telugu News