- కరోనా బారినపడిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
- హైదరాబాదులో చికిత్స
- ధైర్యంగా ఉండడమే కరోనాకు మందు అని పేర్కొన్న బాజిరెడ్డి
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత అధికమైంది. రాష్ట్రంలోని కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రమాదకర వైరస్ బారినపడ్డారు. వారిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఒకరు. ఆయన ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఓ వీడియోలో తన అభిమానులు, కార్యకర్తలకు సందేశం అందించారు. తనపై ప్రేమ చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా తీవ్రతను గుర్తెరిగి తప్పకుండా మాస్కులు ధరించాలని, విధిగా భౌతికదూరం పాటించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండడమే మందు అని పేర్కొన్నారు.