భారత్, చైనా వివాదాలపై ప్రపంచ దేశాల ఆందోళన!

International Media on India China Border War
  • ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి
  • 1975 తరువాత జవాన్లు మరణించడం ఇదే ప్రథమం
  • పలు పత్రికల ప్రత్యేక కథనాలు
ఇండియా, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం గాలివానలా మారి, ప్రాణాలు తీసుకునేంత స్థాయికి చేరడంతో, పలు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం రాత్రి జరిగిన దాడుల్లో 20 మంది భారత సైనికులు, 43 మంది చైనా జవాన్లు మరణించారన్న వార్తలు పలు దేశాలను వణికించాయి. రెండు దేశాలూ అణ్వాయుధాలను కలిగివుండటం, ఏ దేశంలోనూ వెనక్కు తగ్గే ప్రభుత్వాలు లేకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని విదేశీ మీడియా ఈ విషయంలో ప్రత్యేక కథనాలను ప్రచురించింది. 

హిమాలయ పర్వత సానువుల్లోని సరిహద్దుల్లో జరిగిన గొడవలు చాలా సాధారణమేనని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే ఉందని సర్దిచెప్పుకుంటున్నాయి. 1975 తరువాత, ఇరు దేశాల మధ్యా జరిగిన గొడవల్లో సైనికులు మృత్యువాతపడటం ఇదే తొలిసారని విదేశీ పత్రికలు ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి. ఇదే సమయంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజ్జియాన్ మాత్రం తమ వైపు నుంచి జవాన్లు మరణించారని మాత్రం అంగీకరించలేదని "ది వాషింగ్టన్ పోస్ట్" పేర్కొంది.

వాస్తవాధీన రేఖను భారత జవాన్లు దాటారని చైనా, కాదు... చైనాదే తప్పని ఇండియా ఈ విషయంలో తమతమ వాదనలు వినిపించాయని వెల్లడించిన పత్రిక, అసలు విషయం తెలియాల్సి వుందని పేర్కొంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఇరు దేశాలూ ఇబ్బందులు పడుతూ, మహమ్మారిపై పోరాటం చేస్తున్న వేళ ఈ తరహా విభేదాలు అవసరమా? అని ప్రశ్నించింది. ఇది మొత్తం ప్రపంచానికే విఘాతం కలిగిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.
Go Back to Shorts
India
China
Border
War

More Telugu News