సిగ్గు, శరం ఉంటే జగన్ రాజీనామా చేయాలి: బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి

  • జగన్ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు
  • ఆయన తప్పులను కేంద్రం గమనిస్తోంది
  • జగన్ కు కోర్టులపై నమ్మకం లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తే... అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ కు కోర్టులపై గౌరవం లేదని... న్యాయస్థానాలను తప్పుపడితే నాశనం అవుతారని... జగన్ కు కూడా అదే గతి పడుతుందని చెప్పారు. ఎన్నో కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నారని... ఆయన చేస్తున్న తప్పులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పడం చాలా చిన్న పదం అని... ముక్కు పగిలేలా కొట్టిందనేది కరెక్ట్ అని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో ఇంత జరుగుతున్నా జగన్ సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సిగ్గు, శరం ఉంటే జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను మార్చేందుకు అడ్డదిడ్డంగా ఆర్డినెన్స్ ను జారీ చేశారని అన్నారు. రాష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. జగన్ చెప్పిన చోట సీఎస్ నీలం సాహ్ని సంతకం పెడుతున్నారని... అందుకే ఆమె పదవీ కాలాన్ని పొడిగించారని చెప్పారు.

Jagan
YSRCP
Adinarayana Reddy
BJP

More Telugu News