అశ్వగంధకు కరోనాను నిర్మూలించే శక్తి: అధ్యయనంలో వెల్లడి

  • అశ్వగంధపై ఢిల్లీ ఐఐటీ, జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన
  • అశ్వగంధ మూలికలు, పుప్పొడికి అద్భుత శక్తి
  • కోవిడ్ మరణాలను తగ్గించవచ్చంటున్న పరిశోధకులు
కరోనాకు ఆయుర్వేద ఔషధం అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడికి కోవిడ్‌ను నిరోధించే శక్తి ఉన్నట్టు తేలింది. కరోనా వైరస్ వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రధాన ప్రొటీన్‌లను విభజించేందుకు ఉపయోగపడే ఎస్-2 ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పరిశోధన నిర్వహించారు.

అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్ యాసిడ్ పెంథాల్ ఈస్ట్ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ఔషధాన్ని చికిత్సలో వాడి కోవిడ్ మరణాలను తగ్గించొచ్చని పరిశోధకులు తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా అశ్వగంధకు ఇప్పటికే మంచి పేరుందని, దానికి వైరస్‌తో పోరాడే శక్తి కూడా ఉందని తాజా అధ్యయనంలో తేలిందని ఢిల్లీ ఐఐటీ బయోకెమికల్ అండ్ బయో టెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.సుందర్ అన్నారు. కాగా, ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాన్ని జర్నల్ ఆఫ్ బయోమలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్‌లో ప్రచురణకు అనుమతి లభించినట్టు ఢిల్లీ ఐఐటీ తెలిపింది.


More Telugu News

Ashwagandha COVID-19 IIT Delhi Japan