మడ అడవులను నరికేయడం క్షమించరాని నేరం.. తీవ్ర నష్టం వాటిల్లుతుంది, జగన్ గారు: సోమిరెడ్డి

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని మడ అడవులను నరికివేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

'వైసీపీ కాంట్రాక్టర్లు ఇలా అడవులు నరికేయడం సరికాదు. సముద్ర జీవులకు కూడా ఆ అడవులు ముఖ్యం. తుపానులు వచ్చినా మడ అడవులు కాపాడుతాయి. సముద్రపు ఒడ్డున పరిస్థితులను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు జీవుల నివాసానికి కూడా మడ అడవుల చెట్లు అవసరం' అని చెప్పారు.

'సముద్ర నీళ్లను గ్రామాల్లోకి రాకుండా మడ అడవులు కాపాడతాయి. ఉప్పు నీటిలో చాలా శాతాన్ని కూడా మడ చెట్లు పీల్చుకుంటాయి. వాతావరణ సమతుల్యానికి అవి ముఖ్యం. మడ చెట్లు నరుకుతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే స్వయంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం సరికాదు' అని ఆయన వ్యాఖ్యానించారు. 'జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషించే మడ అడవులను నరికేయడం క్షమించరాని నేరం జగన్  గారు' అని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News