Odisha: ప్రసూతి వార్డులోకి అనుమతించలేదని.. డాక్టర్ చెవి కొరికిన గర్భిణి భర్త

  • ఒడిశాలోని బరంపురంలో ఘటన
  • అడ్డుకున్న వైద్యులపై దాడిచేసి వీరంగం
  • అరెస్ట్ చేసిన పోలీసులు
Man Arrested for attack on doctors in Odisha

ప్రసూతి వార్డులోకి వెళ్లకుండా అడ్డుకున్న వైద్య సిబ్బందిపై దాడికి దిగిన ఓ వ్యక్తి వైద్యుడి చెవి కొరికేశాడు. ఒడిశా, బరంపురంలోని మహారాజా కృష్ణచంద్ర గజపతి వైద్య కళాశాల ఆసుపత్రిలో నిన్న జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గంజాం జిల్లాలోని పురుషోత్తంపూర్‌కు చెందిన తరిణి ప్రసాద్ మహాపాత్రో కాన్పు కోసం తన భార్యను ఆసుపత్రిలో చేర్చాడు. అయితే, అప్పటికే ఆమె వద్ద ఐదుగురు కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తరణి కూడా ప్రసూతి వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

గమనించిన వైద్య సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో చిందులేసిన తరిణి ప్రసాద్ తనను అడ్డుకున్న వైద్యుడు స్మృతి రంజన్‌పై దాడిచేశాడు. అప్రమత్తమైన మిగతా వైద్యులు అతడిని అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన తరిణి, పీజీ వైద్య విద్యార్థి షకీల్ ఖాన్ ఎడమ చెవిని బలంగా కొరికేశాడు. మిగతా వైద్యులపైనా దాడిచేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తరిణి ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.

More Telugu News