తెలంగాణలో 21 వరకూ లాక్ డౌన్... రేపు ప్రకటించనున్న సీఎం?

Lackdown Extenssion in Telangana
  • సూత్రప్రాయంగా నిర్ణయించిన కేసీఆర్
  • కొత్త కంటైన్ మెంట్ల జోన్ల క్వారంటైన్ గడువు కూడా పరిగణనలోకి
  • మంగళవారం నాటి క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం
తెలంగాణలో ఈ నెల 21 వరకూ లాక్ డౌన్ ను పొడిగించాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 7 వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండగా, కొత్తగా గుర్తించిన కంటైన్ మెంట్ జోన్ల క్వారంటైన్ గడువు 21తో ముగుస్తుంది.

దీంతో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆ మేరకు లాక్ డౌన్ ను పొడిగిస్తేనే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా విస్తరణ, లాక్ డౌన్, మద్యం షాపుల పునఃప్రారంభం, వలస కార్మికుల తరలింపు, ప్రజా రవాణా తదితర అంశాలపై ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేసీఆర్, అన్ని అంశాలపైనా చర్చించారు. రెండువారాల పాటు లాక్ డౌన్ ను కేంద్రం పొడిగించగా, అంతే సమయం పాటు రాష్ట్రంలోనూ లాక్ డౌన్ ను పొడిగించాలని పలువురు అధికారులు సీఎంకు సూచించినట్టు తెలిసింది.

ఇక మంగళవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్, మద్యం విధానం, సడలింపులపై నిర్ణయం తీసుకుని, దాన్ని కేసీఆరే స్వయంగా ప్రజలకు తెలియజేస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. 7వ తేదీ తరువాతి వ్యూహంపై మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.

 రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం కరోనా మహమ్మారి విజృంభించే చాన్స్ ఉన్నందున, లాక్ డౌన్ ను కొనసాగిస్తేనే మేలని అధికారులు కేసీఆర్ కు సూచించారు. ఇక, ఈ విషయంలో ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Lockdown
Telangana
KCR
Cabinet
Extenssion

More Telugu News