ఎన్నికలను యథాతథంగా జరిపించండి.. ఈసీ రమేశ్ కు ఏపీ సీఎస్ నీలం సాహ్నీ లేఖ!

AP CS Letter to SEC Nimmagadda Ramesh
  • స్థానిక ఎన్నికలను నిర్వహించండి
  • అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధం
  • కరోనా కట్టడి బాధ్యత ప్రభుత్వానిదే
  • నిమ్మగడ్డ రమేశ్ కు స్పష్టం చేసిన నీలం సాహ్నీ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కనీసం ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో, ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్, సీఎం వైఎస్ జగన్ మధ్య వాడి వేడి మాటల యుద్ధం జరుగుతూ ఉండగా, ఈ వ్యవహారంలోకి చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ సైతం వచ్చి చేరారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని పేర్కొంటూ, ఈసీకి ఆమె లేఖ రాశారు. కరోనా పేరిట ఎన్నికలను వాయిదా వేయడాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె కోరారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా, ఓట్ల ముద్రణ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని పేర్కొన్న ఆమె, ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదని, కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు.

కాగా, నిన్నటి పరిణామాలు, ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచగా, నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్ భేటీ కానున్నారు. ఇప్పటికే జగన్, గవర్నర్ ను కలిసి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే గవర్నర్, ఎస్ఈసీల భేటీ కీలకం కానుంది.
Go Back to Shorts
Neelam Sahney
Corona Virus
SEC
Nimmagadda Ramesh

More Telugu News