ఎన్నికలకు ముందే మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపాను... డొక్కా మాణిక్య వరప్రసాద్ బహిరంగ లేఖ!

ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న విషయమై ఓ బహిరంగా లేఖను రాశారు. పలు విషయాలపై ఆయన తన మనసులోని మాటను ఈ లేఖలో వివరించారు.

'మిత్రులు, శ్రేయోభిలాషులకు... నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ...' అంటూ ప్రారంభించిన ఆయన, సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని, అయితే, ఆ పార్టీ నేతలతో మాత్రం చర్చించలేదని స్పష్టం చేశారు.

తాను ఏ పార్టీలో ఉన్నా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని డొక్కా వ్యాఖ్యానించారు. తనపై నీతి బాహ్యమైన, చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన ప్రవర్తన ప్రజలకు సుస్పష్టమని అన్నారు. రాజకీయ పార్టీ అన్నది ప్రజా సేవకు ఓ వేదిక మాత్రమేనని, ఆ వేదిక ద్వారా తనదైన శైలిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాసిన లేఖను మీరూ చూడవచ్చు.

Dokka
Dokka Manikya Varaprasad
Open Letter
YSRCP

More Telugu News