ట్రంప్ పర్యటనలో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్

Anti Drone System To Be Used During Trumps Visit
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యవస్థను వాడనున్న భారత్
  • అహ్మదాబాద్ రోడ్ షోలో వినియోగించనున్న పోలీసులు 
  • అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన యాంటీ–డ్రోన్ సిస్టమ్ ను ఉపయోగించనున్నారు. రెండు రోజుల పాటు మన దేశంలో ఉండనున్న ట్రంప్ భద్రత కోసం దాదాపు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు కలసి పని చేయనున్నాయి. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పారా మిలటరీ దళాలు భద్రతలో నిమగ్నం కానున్నాయి.

అయితే, ఉగ్రవాద సంస్థలు ఈ మధ్య డ్రోన్ దాడులు చేస్తుండడంతో వాటిని తిప్పికొట్టేందుకు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ–డ్రోన్ సిస్టమ్ ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అహ్మదాబాద్‌ లో ట్రంప్ –మోదీ రోడ్ షోలో ఈ డ్రోన్ సిస్టమ్ ను ఉపయోగించి గగనతలంలోకి మరే డ్రోన్ లు రాకుండా నిరోధిస్తామని గుజరాత్ పోలీసులు చెబుతున్నారు.

రిపబ్లిక్ డే పరేడ్ లో తొలిసారి వినియోగం:

గత కొంతకాలంగా అసాంఘిక శక్తులు డ్రోన్ల సాయంతో చిన్న చిన్న ఆయుధాలు, నార్కోటిక్స్ ను స్మగ్లింగ్ చేస్తున్నాయి. అలానే 3–4 కిలోల పేలుడు పదార్థాలతో నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి. అలాంటి డ్రోన్లను అంతం చేసేందుకు డీఆర్డీఓ కౌంటర్ డ్రోన్–సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. ట్రయల్స్ లో వాటిని విజయవంతంగా పరీక్షించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కు హాజరైన కార్యక్రమంలో ఈ కౌంటర్–డ్రోన్ సిస్టమ్ ను తొలిసారి వినియోగించారు.
Go Back to Shorts
Donald Trump
USA
Narendra Modi
India
Anti-Drone System

More Telugu News