అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్లతో దాడి

Rocket attack hits Iraq base hosting US troops
  • ఇరాక్ లోని కే1 స్థావరంపై నిన్న రాత్రి రాకెట్లతో దాడి
  • డిసెంబర్ 27న ఇదే స్థావరంపై 30 రాకెట్లతో దాడి
  • అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం
ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరంపై నిన్న రాత్రి మరోసారి రాకెట్లతో దాడి జరిగింది. కిర్కుక్ ప్రావిన్సులో అమెరికా బలగాలు ఉన్న కే1 స్థావరంపై కత్యుషా రాకెట్లతో దాడి చేశారు. అయితే, ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గత డిసెంబర్ 27న ఇదే స్థావరంపై రాకెట్లతో దాడి చేశారు. దాదాపు 30 రాకెట్లను ప్రయోగించారు. ఆ దాడుల్లో అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి మరణించారు. దీనికి కారణం హెజ్బోలా ఉగ్రవాద సంస్థ అని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఆ తర్వాత అమెరికా జరిపిన ప్రతీకార దాడుల్లో 25 మంది హెజ్బోలా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతం చేసిన తర్వాత... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్ కు చెందిన పలు ఉగ్ర సంస్థలు అమెరికా స్థావరాలపై దాడులకు దిగుతున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Iraq
USA
Americal Base
Rocket Attack
Iran

More Telugu News