అసెంబ్లీకి దొడ్డిదారిన... హైకోర్టుకు మాత్రం రాజమార్గంలో..!: సీఎం జగన్ పై అయ్యన్న వ్యంగ్యం

  • రాజధాని గురించి మేనిఫెస్టోలో చెప్పలేదన్న అయ్యన్న
  • రాజధాని విశాఖలో కావాలని ఎవరడిగారంటూ ఆగ్రహం
  • విశాఖపై ప్రేమ ఉంటే పరిశ్రమలు తీసుకురావాలని హితవు
అసెంబ్లీ అమరావతిలో, సచివాలయం విశాఖలో ఉంటే పాలన ఎలా సజావుగా సాగుతుందంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రాజధాని గురించి మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని, మరి ఎవరు అడిగారని ఇవాళ రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై అయ్యన్న వ్యంగ్యం ప్రదర్శించారు.  అసెంబ్లీకి దొడ్డిదారిన వెళతారని, హైకోర్టుకు మాత్రం ఎంచక్కా రాజమార్గంలో వెళతారని ఎద్దేవా చేశారు.

కావాలంటే విశాఖలోనే అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని అయ్యన్న ప్రశ్నించారు. విశాఖలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఏర్పాటు చేస్తే అమరావతిలో ఉన్న ఉద్యోగులు విశాఖకు వస్తారని, అంతకుమించి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. విశాఖపట్నంపై నిజంగా అంత ప్రేమే ఉంటే మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలని హితవు పలికారు. అయినా రాజధాని మార్పు అంశం సాధారణమైంది కాదని, రాష్ట్రంలో ఏదేనీ అంశం సమస్యాత్మకంగా మారినప్పుడు కేంద్రమే పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Ayyanna Patrudu
Jagan
Visakhapatnam
AP Capital
Andhra Pradesh
Amaravati

More Telugu News